భూపాలపల్లి: డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. ఆ తర్వాత తమ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపిస్తుందని అన్నారు. భూపాలపల్లిలో గురువారం జరిగిన బహిరంగసభలో పొన్నాల మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతిమయమైపోయిందని పొన్నాల ఆరోపించారు. 


కేసీఆర్‌ అరాచకాలు, అవినీతికి ఎదురులేకుండా పోయిందని.. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజలు బాగుపడతారనుకుంటే, కేసీఆర్‌ దోపిడి చేసి తన ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. అన్ని అభివృద్ధి పథకాల్లో అవినీతికి పాల్పడి దోచుకున్నారని, కేసీఆర్ కుటుంబసభ్యుల ఆస్తులు పెంచుకున్నారే కానీ తెలంగాణ ప్రజల పరిస్థితి మాత్రం మళ్లీ ఎప్పటిలానే తయారైందని పొన్నాల విమర్శించారు.