సింగరేణి ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీలవుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్ హనుమంతరావు విమర్శించారు. కేసీఆర్ తన సొంత కూతురిని గెలిపించడం కోసం ఎన్నికలలో లాబీయింగ్ చేశారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గెలిచిన తెరాసకు, తమకు కేవలం నాలుగు వేల ఓట్లు మాత్రమే తేడా అని.. తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని నేతగా ఎదిగిన కోదండరామ్ లాంటి వారినే తిట్టడం కేసీఆర్ స్వభావమని.. ఆయన భాష ఆక్షేపణీయంగా ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీని ఆకర్షించడం కోసం, కేసీఆర్ ఎప్పుడూ ప్రతి పక్షాలను టార్గెట్ చేస్తున్నారని,  ఆయన అప్రజాస్వామిక పద్ధతులు ప్రజలు చూస్తున్నారని.. వారే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని  ఆయన తెలిపారు. త్వరలో ఇందిర రథయాత్ర చేపడతామని, తెలంగాణలో కాంగ్రెస్ ఒరవడి ఏమిటో తమకు తెలుసని, వీహెచ్ ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు.