LRS Scheme in Telangana: హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ పథకం అమలు విషయంలో సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడేవరకు వేచిచూడాల్సిందేనని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యేవరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంశాలపై దాఖలైన పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చిన సందర్భంగా హై కోర్టు (TS High court) ఈ వ్యాఖ్యలు చేసింది. 


హై కోర్టులో విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం (Telangana govt) స్పందిస్తూ ఎల్ఆర్ఎస్‌పై పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉందని హైకోర్టుకు తెలిపింది. ఇదే అంశమై సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో సుప్రీం కోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున మళ్లీ తాము వేరేగా విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన హైకోర్టు.. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌ పథకం (LRS, BRS scheme) అమలుపై దాఖలైన పిటిషన్లన్నింటిపై ప్రస్తుతానికి విచారణ ముగిసినట్టేనని స్పష్టంచేసింది.