కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కుటుంబ సమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఏడురోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌‌కు వచ్చిన ఆయన పర్యటనలో భాగంగా తాజ్‌ను సందర్శించారు. గత కొన్ని సంవత్సరాలలో చాలామంది విదేశీ నాయకులు, ప్రముఖులు తాజ్‌మహల్‌ను సందర్శించారు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యమునా నది తీరాన ఉన్న తాజ్‌మహల్‌ను 17వ శతాబ్దపు మొఘల్ పాలకుడైన షాజహాన్ తన భార్య ముంతాజ్‌మహల్ (ముంతాజ్ తన 14వ శిశువుకు జన్మనిచ్చినప్పుడు చనిపోయింది) జ్ఞాపకార్థం కట్టించాడు. ఈ కట్టడాన్ని భారత, పర్షియన్, ఇస్లామిక్ ప్రభావాల కలయికతో నిర్మించారు. అత్యంత అసాధారణ కట్టడాలలో ఇదొకటి. నాలుగు మినార్లు కలిగి ఉన్న ఈ  స్మారక కట్టడం పూర్తిగా తెల్ల పాలరాయితో నిర్మించబడింది. విలువైన రాళ్లు, ఖురాన్ శ్లోకాలతో చెక్కబడింది. ఇది ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. 1983 నుండి యునెస్కో వరల్డ్ తాజ్‌మహల్‌ను హెరిటేజ్ సైట్ గా గుర్తించింది.




 


తాజ్‌మహల్ సందర్శించిన తరువాత, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మధుర వెళ్తారు. అక్కడ ఎలిఫెంట్ కన్జర్వేషన్ సెంటర్‌ని సందర్శిస్తారు. ఆయన ఉండే రెండు గంటల సమయం వరకు అభయారణ్యంలోకి సామాన్య ప్రజలను అనుమతించరు.


పర్యటనలో భాగంగా ట్రూడో భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో ఆయన రక్షణరంగం, ఉగ్రవాద నిర్మూలన మొదలైన విషయాలతో సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కెనడియన్ ప్రధాని ట్రూడో పర్యటనలో భాగంగా ఆగ్రా, అమృత్సర్, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో పర్యటిస్తారు. కెనడా-భారతదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడానికి ట్రూడో ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు.