కుల్‌భూషణ్ జాధవ్‌ని అక్రమ చొరబాటుదారుడిగా అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్.. గూఢచర్యం నేరం కింద పాకిస్తాన్ అతడిని అక్రమంగా జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లోనే పాకిస్తాన్ మిలిటరీ కోర్టు కుల్‌భూషణ్ జాధవ్‌కి మరణ శిక్ష సైతం విధించింది. అయితే, పాక్ మిలిటరీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం గతేడాది మే నెలలోనే అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. దీంతో భారత సర్కార్ విజ్ఞప్తిపై స్పందించిన అంతర్జాతీయ కోర్టులోని 10 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. "కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు తీర్పు అమలు చేయకుండా నిలిపేయాల్సిందిగా" ఈ ఏడాది మే నెలలో పాక్‌కి ఆదేశాలు జారీచేసింది. 


తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ కోర్టులో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు కుల్‌భూషణ్ జాధవ్ కేసు విచారణకు రానుంది. హేగూ(నెదర్లాండ్స్‌)లో ఉన్న పీస్ ప్యాలెస్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు బహిరంగ విచారణ జరగనుంది.