అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశంలో అమ్మఒడి పథకానికి ఆమోదం లభించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అందరు విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. తల్లి లేని పిల్లల విషయంలో వారి సంరక్షకులకు ఆ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. 


ఈ సందర్భంగా అమ్మఒడి పథకం అర్హతలు, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించదల్చుకున్న బడ్జెట్ వివరాలను మంత్రి వివరించారు. తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు కలిగి వున్న వారు మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హులని.. వచ్చే ఏడాది జనవరి నుంచి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి అమ్మఒడి పథకం ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామని మంత్రి స్పష్టంచేశారు. అమ్మ ఒడి పథకం కింద ప్రతీ ఏడాది రూ. 15,000 ఆర్థిక సహాయం అందివ్వనున్నామని ప్రకటించిన మంత్రి పేర్ని నాని.. పథకం అమలు కోసం రూ.6,450 కోట్లు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు.