ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2018-19పై తెదేపా నేతలు గుర్రుగా ఉన్నారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు బెదరాల్సిన పని లేదని అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. నిపుణులు వద్దంటున్నా.. కేంద్రం మాత్రం రైల్వేజోన్ ఏర్పాటుకే మొగ్గు చూపుతోందని రాష్ట్ర బీజేపీ నేతలకు సమాధానమిచ్చారు.


గురువారం సాయంత్రం అమిత్ షాతో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి అమిత్ షా పలు సూచనలు చేశారని సమాచారం. కొద్దిరోజులుగా టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని, బడ్జెట్‌ తర్వాత ఆ పార్టీ చేస్తున్న విమర్శలపై సమావేశంలో చర్చించారు.  ఈ సందర్భంగా అమిత్ షా ఏ పీకి అడిగినవన్నీ ఇస్తున్నాం కదా! అని అన్నారట. సమావేశం ముగిశాక రాష్ట్ర బిజేపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేయగా 'ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు!' అని ఆయన చెప్పినట్లు పురంధేశ్వరి చెప్పారు.