మా సమాచారం (డేటా) తస్కరించి మమ్మల్నే బెదిరిస్తున్నారా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రం, తెలంగాణ సర్కార్, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌లపై విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా ఐటి గ్రిడ్ కంపెనీ ఉదంతంలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం, తెలంగాణ సర్కార్ ఆర్థిక ఉగ్రవాదులలాగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సమాచారాన్ని తస్కరించి ఏపీ సర్కార్‌ని ఐటీ, సీబీఐ దాడులతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామికవేత్తలను, ముఖ్యమైన నాయకులను బెదిరిస్తూ మానసిక క్షోభకు గురిచేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 


ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్ అంతా ఏకమై కుట్ర చేస్తున్నారని, కానీ తాను ఎటువంటి బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.