AP Skill Development Scam News: అమరావతి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.  టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరంగా ఉందని అసహనం వ్యక్తంచేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. నిన్న, ఈ రోజు జరిగిన శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో రాష్ట్ర సమస్యలకు సంబంధించి సభ్యులు ఏఏ ప్రశ్నలు అడిగారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సమాధానాలు ఇస్తారనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, దురదృష్టమేమంటే.. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక పథకం, కుట్ర ప్రకారం రెండూచోట్ల అసెంబ్లీ, కౌన్సిల్ లలో రచ్చరచ్చ చేశారు. టీడీపీ సభ్యులు మాటల్లో చెప్పలేనివిధంగా అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా గొడవలు చేశారు. అవినీతికి పాల్పడి అరెస్టయిన తమ పార్టీ అధినేత చంద్రబాబును విడుదల చేయాలని.. ఏకపక్షంగా ఆయనపై కేసులు ఎత్తేయాలని రెండురోజులపాటు సభల్లో తెలుగుదేశం పార్టీ సభ్యుల వ్యవహార తీరును ప్రజలంతా గమనించారు అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాబు అరెస్టు చర్చలో మీరెందుకు పాల్గొలేదు. ? :
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని నేనొక విషయంపై సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు చంద్రబాబు అరెస్టుపై సమావేశాల్లో చర్చించాలని అడిగారు. అందుకు, మేమూ సరేనన్నాం. ప్రభుత్వం తరఫున సుదీర్ఘంగా వివరిస్తామని ముందుకొచ్చాం. ఆమేరకు ఈరోజు చర్చను మొదలుపెట్టాం. మరి, ఈ తెలుగుదేశం పార్టీ సభ్యులు సమావేశాల్లో లేకుండా ఎందుకు పారిపోయారు ? అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు అరెస్టుపై మీ అభిప్రాయం ఎందుకు చెప్పలేదు ? మీ పార్టీ అధినేత ఏ తప్పూ చేయలేదని.. అసలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామే జరగలేదని మీరెందుకు చెప్పకుండా బయటకు వెళ్లారు ? మీ నాయకుడు చంద్రబాబు నిప్పు.. సచ్ఛీలుడైతే ఆయన పక్షాన మీరు సమావేశాల్లో ఉండి వివరించాలి.. ప్రజలకు కళ్లకు కట్టినట్లు చెప్పాలి కదా ? అలాంటిది, చర్చ చేయాలన్న సభ్యులే సమావేశాల నుంచి ఎందుకు వెళ్లిపోయినట్లు అనేది సమాధానం చెప్పాలని తెలుగు దేశం పార్టీ సభ్యులను నిలదీసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర ప్రజలంతా దీనిపై ఆలోచన చేయాలని కోరుతున్నాను అని విజ్ఞప్తి చేశారు.


నిజాలపై చర్చించే దమ్ములేకనే బయటకెళ్లారు :
తెలుగుదేశం పార్టీ సభ్యుల ద్వంద్వవైఖరిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. వారి కోరిక మేరకే చంద్రబాబు అరెస్టుపై మేం చర్చ మొదలు పెట్టగానే మీరు సమావేశం నుంచి బయటకెళ్లడాన్ని ఎలా అర్ధం చేసుకోవా లి..? ఇందులో నిజమేంటంటే, మీకు చంద్రబాబు స్కామ్‌ గురించి అంతా తెలుసు. యువతకు ఉపాధిశిక్షణ పేరుతో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను అడ్డంపెట్టుకుని ఆయన, ఆయన బినామీలు కలిసి ఏ మేరకు షెల్‌కంపెనీలతో అవినీతి కథ నడిపారో.. హవాలా మార్గాల్లో వందల కోట్లు ఎలా దోచుకున్నారనేది మీకు తెలుసు. కాబట్టే.. నిజాలు చర్చించేటప్పుడు మీరు సమావేశంలో లేకుండా వెళ్లారనేది ప్రజలకూ అర్ధమైపోయింది. నిజాలపై చర్చించే దమ్మూధైర్యం లేదని వారు బహిరంగంగా ఒప్పుకోవచ్చుకదా..? ఏదిఏమైనా టీడీపీ సభ్యుల తీరు దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదని తెలియజేసుకుంటున్నాను.


న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగింది :
చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ లతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపడంపై ప్రజల్లో చట్టబద్ధమైన వ్యవస్థల పట్ల నమ్మకం ఏర్పడింది. న్యాయవ్యవస్థ, పోలీసులు చట్టాలకు లోబడే పనిచేస్తాయి గానీ.. రాజకీయ ప్రలోభాలకు లోబడే వ్యవస్థలు పనిచేయవు. కాబట్టే.. స్కిల్‌డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ సూత్రధారిగా ఆధారాల్ని నిర్ధారించి జైలుకు పంపారు. దీనిపై తెలుగుదేశం సభ్యులకు ఏమైనా అభ్యంతరాలుంటే.. న్యాయవ్యవస్థలోనో, లేదంటే శాసనసభా సమావేశాల్లోనో చర్చించే అవకాశాలున్నాయి. కానీ, వారెందుకు ఈ వేదికలను సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావడంలేదో ఎవరికీ అర్ధంకావట్లేదు. 


చంద్రబాబు దొంగ అని నిరూపించాం :
ఈరోజు స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి చంద్రబాబు అరెస్టుపై సుదీర్ఘంగా చర్చించాం. స్కామ్‌ మొదలుదగ్గర్నుంచీ ఆయన చీకటి ఒప్పందాలు, షెల్‌ కంపెనీలకు ప్రజాధనం విడుదల చేయడానికి ఎంతగా అధికారులపై వత్తిళ్లు పెట్టారో.. అన్నీ సుదీర్ఘంగా మేం ప్రభుత్వం తరఫున పాయింట్లవారీగా వివరించాము కదా..? మరి, ఆ సమయంలో తెలుగుదేశం సభ్యులూ చర్చలో పాల్గొని తమ అధినేత మంచోడో కాదోననే విషయంపై  సమాధానం చెప్పాలి కదా..?
-  సీమెన్స్‌ ఒప్పందం మేరకు 90 : 10 నిష్పత్తి వాటాల గురించి తెలుగుదేశం పార్టీ సభ్యులే చెబుతున్నారు. ప్రభుత్వవాటా రూ.371 కోట్లు విడుదల నిజమేనని ఒప్పుకుంటున్న వారు సీమెన్స్‌ ఒప్పందంవాటా ఎందుకు రాలేదో చెప్పాలి కదా ? 
- డిజైన్‌టెక్‌ నుంచి షెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు అందిన వందల రూ.కోట్లు గురించి లెక్కలు వివరిస్తే బాగుండేది కదా ? 
- మరి, ఏమైంది మీ నిజాయితీ..? చర్చల్లో పాల్గొంటే దొరికిపోతామన్నది ఆ పార్టీ సభ్యుల భయంగా అర్ధంచేసుకోవాలి. 
- కనుక, చంద్రబాబు ప్రజాధనం కొల్లగొట్టిన దొంగ అని.. ఆయన అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడటం వాస్తవమని మేము మరోమారు నిరూపించాము.
-  దీన్ని ప్రజలంతా గమనించి ఆలోచన చేయాలని మనవిచేసుకుంటున్నాను అని ప్రజలకు విజ్ఞప్తి చేయడం ద్వారా మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ సభ్యులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.