అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇప్పటికే నిర్మించిన రోడ్లు, భవనాలను యధాతధంగా వినియోగిస్తూ.. మిగులు భూమిని స్పెషల్ అగ్రికల్చర్ జోన్ (Special Agriculture Zone)గా ఉపయోగించుకోవాలని ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే దీనిపై ఓ నివేదికతో కూడిన ప్రతిపాదనను వ్యవసాయ శాఖ నిపుణులు సిద్దం చేశారని... రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి ప్రాంతం అనుకూలమని నిపుణులు ఆ నివేదికలో సూచించారని సమాచారం. నిపుణుల సూచనల మేరకు ల్యాండ్ పూలింగ్ భూములు సహా ప్రభుత్వ భూములనూ ఈ స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చి... కాలక్రమంలో వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్‌గా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. Read also : గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతోపాటు అమరావతి రైతులకు వైసిపి నేతల హామీ


రైతులకు మరింత లబ్ది కలిగించాలని భావిస్తోన్న సర్కార్..
రైతులకు మరింత లబ్ది కలిగించేలా సలహాలు, సూచనలు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు.. స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌లో రైతులను సైతం భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు తిరిగి ఇచ్చేసి.. మిగిలిన భూములను స్పెషల్ అగ్రికల్చర్ జోన్ పరిధిలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే యోచనలోనూ సర్కార్ ఉన్నట్టు సమాచారం. స్పెషల్ అగ్రికల్చర్ జోన్ ద్వారా నిపుణలతో పాటు ఇతరులకూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. అంతేకాకుండా స్పెషల్ అగ్రికల్చర్ జోన్‌కు అనుబంధంగా ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలూ అభివృద్ధి చెందుతాయని నిపుణులు నివేదికలో పేర్కొన్నట్టు వార్తలొస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..