Family Doctor Concept in AP: మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అదేరోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభమవుతుందన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి విలేజ్‌ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారని చెప్పారు. జనాభా 4 వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌లో ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. మార్చి 1 నుంచి కూడా గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్‌ అందిస్తామన్నారు. ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. 


విలేజ్‌ క్లినిక్స్‌ ఎస్‌ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను చేర్చామని అధికారులు వివరించగా.. విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలన్న సీఎం ఆదేశించారు. మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్‌ వీటిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని సూచించారు. 


'108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతిరోజూ దీనిపై సమీక్ష చేయాలి. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలి. సిబ్బంది ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ సేవలను వివరించాలి. తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందించాలి. గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలి. హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలి. 


రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా..? లేదా..? అన్నదానిపై దృష్టిపెట్టాలి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నాం. పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోంది..' అని సీఎం జగన్ అన్నారు. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. 


Also Read: Bank Holidays: బ్యాంక్‌ వినియోగదారులకు ముఖ్యగమనిక.. రేపటి నుంచే వరుసగా సెలవులు  


Also Read: PPF Calculator: పీపీఎఫ్‌లో భారీ ఆదాయం పొందాలనుకుంటున్నారా..? ఈ ట్రిక్‌ పాటిస్తే మీరు కోటీశ్వరులే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook