CM Jagan Mohan Reddy Vs YS Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందరి కళ్లు.. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలపై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ గడ్డపై వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించి.. ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. తాను తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాననీ..చివరి వరకూ ఇక్కడే ఉంటానంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. ఒకానొక దశలో షర్మిల పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న అంచనాలు కూడా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుడే అనూహ్యంగా షర్మిల ట్వీస్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లోకి వచ్చారు. దాంతో నాలుగు నెలల పాటు ఈ చర్చల వ్యవహారం కొనసాగింది. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో విలీనానికి బ్రేక్ పడింది. సడెన్‌గా షర్మిల సైలెంట్ అయిపోయారు. చివరకు తెలంగాణ ఎన్నికల బరిలోకి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.


కట్ చేస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అదే జరిగితే.. సొంత అన్నపై చెల్లెలు షర్మిల రూపంలో హస్తం పార్టీ బాణం వదిలినట్లే. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడూ, ఎన్నికల సమయంలోనూ షర్మిల అన్నీ తానై వ్యవహరించారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పదే పదే చెప్పుకున్నారు. ఆ తర్వాత అన్నతో విభేదాలు కారణంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. పలుమార్లు అన్నతో ఎదురుపడినా ఎడముఖం పెడముఖంగానే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు సొంత అన్నకు వ్యతిరేకంగా ఏపీ రాజకీయాల్లో వచ్చేందుకు షర్మిల ససేమిరా అన్నారు. తాజా పరిణామాలు చూస్తే మాత్రం షర్మిల తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో షర్మిల ఎంట్రీపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల వస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనతో చెప్పారని వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే స్వాగతిస్తామంటూ వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు.


షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా చెల్లెల్ని ఒప్పించేందుకు జగన్‌ రాయబారం పంపినట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, స్వయానా తన బాబాయ్‌ అయిన వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించారట. ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందంటూ సుబ్బారెడ్డి .. షర్మిలకు నచ్చజేప్పేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.


దానికి షర్మిల కూడా అంతే ఘాటుగా సమాచారం ఇచ్చారట. ఇన్నాళ్లూ తాము రోడ్డు మీద పడితే ఎవరు పట్టించుకున్నారని సుబ్బారెడ్డిని నిలదీసినట్లు చెబుతున్నారు. అప్పుడు పట్టించుకోని వారు ఇప్పుడు జగన్‌కు ఇబ్బంది అవుతుందని వచ్చారని ప్రశ్నలు వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ముందు ముందు సంచలనాలు తప్పేలా లేవన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల


Also Read: Redmi Note 13 Pro 5G: Redmi Note 13 సిరీస్‌ మొబైల్స్‌ల ధరేంతో తెలుసా? లీక్‌ అయిన ధర, ఫీచర్స్‌ వివరాలు! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter