కృష్ణా జిల్లా కొండూరు మండలంలో మరో దందా వెలుగులోకి వచ్చింది. ఒక ముఠా లేడి మాంసం, దుప్పి మాంసం పేరుతో వీధి కుక్కల మాంసాన్ని గత కొంతకాలంగా భారీగా విక్రయిస్తున్న వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఈ ముఠాలోని కొందరి సభ్యుల్ని అనుమానించిన ఆ ప్రాంత వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ ముఠా సభ్యులను మాటు వేసి పట్టుకున్న పోలీసులు అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. అయితే ఈలోగానే విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు సభ్యులికి దేహశుద్ది చేయడం గమనార్హం.  కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణ్‌ అనే వ్యక్తులు కొంతకాలంగా వీధి కుక్కలను హతమారుస్తూ.. ఆ మాంసాన్ని బాగా  ప్రాసెస్ చేసి ప్యాకింగ్‌గా మారుస్తున్నారు. అదే మాంసాన్ని కొన్ని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు కూడా సమాచారం. దాదాపు కిలో మాంసాన్ని 300 రూపాయల నుండి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు వినికిడి. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు కొండూరు ఎస్సై తెలిపారు