విశాఖపట్నం: దక్షిణ ఛత్తీ‌స్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. దీనికితోడు ఉత్తర ఒడిశాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి క్యుములోనింబస్‌ మేఘాలు అలుముకున్నాయి. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇంకొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. 


రానున్న ఇరవై నాలుగు గంటలపాటు ఈ వాతావరణం ఇలాగే కొనసాగుతుందని.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెపురులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.