బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం ఖరారు అంటూ జరిగిన ప్రచారానికి తెర పడింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతానికి పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా మాజీ మంత్రి, సీనియర్ నేత  కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా నియమించింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.


కాగా సోము వీర్రాజుకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా వచ్చిన వార్తల నేపథ్యంలో గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరేందుకు నిర్ణయించుకుని ఆ మేరకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే చివరి నిముషంలో అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవ్వడంతో ఆప్పట్లో ఆయన వైకాపాలో చేరలేదు. ఆతరువాత బీజేపీ పెద్దల సూచనతో వెనక్కి తగ్గారు. కాగా  ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే!