తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేగంగా పురోగమిస్తున్నాయి. ఇప్పటికే రైతుపవనాలు కర్ణాటక, తమిళనాడులోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. రాయలసీమను నైరుతి రుతు పవనాలు కొద్దిసేపటికి క్రితమే తాకాయని స్థానిక వార్తా ఛానళ్లు పేర్కొన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిసింది. కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఒంటరిగా పొలాల్లో, ఎత్తు ప్రదేశాల్లో ఉండొద్దని.. పిడుగులు పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో..


క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ కృష్ణా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిశాయి. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల చిరు జల్లులు కురవడంతో పాటు ఈదురుగాలులు వీచాయి. రాగల 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.



తెలంగాణలో..


రాష్ట్రంలో నెలకొన్న క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాలలో సోమవారం నుంచి నాలుగు రోజులపాటు అక్కడక్కడా భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సోమ, మంగళ వారాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఈ నెల 6వ తేదీనాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు పేర్కొన్నాయి.