విశాఖపట్నం జిల్లా అరకులోయ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి జాతీయ రహదారులతో ఏజెన్సీ ప్రాంతాలకు అనుసంధానమనేది ఉండాలని, అప్పుడే ఆయా ప్రాంతాలు టూరిజం పరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని పలువురు పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే  చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) మార్గంలో మరో జాతీయ రహదారి 516–ఈను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో రాజమండ్రి, తూర్పు గోదావరితో పాటు విశాఖపట్టణం జిల్లాల్లోని లంబసింగి, పాడేరు, అరకు, ఎస్‌.కోట మీదుగా విజయనగరం ప్రాంతాల వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం అనేది జరగాల్సి ఉంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం నిర్మాణం నిమిత్తం గెజిట్ నోటిఫికేషన్ పంపించింది. ఒకవేళ అరకులోయ లాంటి గిరిజన ప్రాంతం మీదుగా రహదారి వస్తే..  తెలంగాణ నుంచి విశాఖ, విజయనగరం జిల్లాలకు మధ్య దూరం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు నిపుణుల అభిప్రాయం.