భారత దేశంలో ప్రజలకు ఆధార్‌ అనేది ఒక గుర్తింపు సంఖ్యను అందించిన విషయం మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అలాంటి గుర్తింపు సంఖ్యను భూములకు, ఆస్తులకు, ఇళ్ళకు కూడా ఇస్తే ఎలా ఉంటుంది అనే విధంగా యోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం.అందుకోసం మాత్రమే ఏపీ ప్రజలకు ప్రభుత్వం కొత్తగా ‘భూ-ధార్‌’ను పరిచయం చేయాలని సంకల్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను భూదార్ ప్రత్యేకత ‘ఈ-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా కొన్ని జిల్లాల్లో తొలుత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం.  


ఒకవేళ ప్రయోగం సఫలమైతే.. దేశంలో తొలిసారి భూదార్ అమలు చేసిన ఘనత ఏపీకి దక్కుతుంది. తొలివిడతలో ఈ విధానాన్ని ప్రాక్టికల్‌గా సమీక్షించడానికి కృష్ణా జిల్లాను ఎంచుకున్నారు. విప్రో సంస్థ ఈ ప్రాజెక్టుకు టెక్నికల్ సహకారం అందిస్తోంది. అలాగే పలు సలహాలు, సూచలను కూడా అందిస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ-ప్రగతి, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ఇత్యాది అంశాలపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల ఆస్తులకు డిజిటల్ భద్రత సమకూర్చడమే ఈ భూదార్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.