సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మడిమ గాయంతో బాధపడుతున్నారు. రేపు బుధవారం నుంచి జన చైతన్య పోరాట యాత్రలో పాల్గొననున్న పవన్ కల్యాణ్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నేల తడిగా ఉండటంతో పవన్ కల్యాణ్ కాలు స్కిడ్ అయి బెణికింది. దీంతో కాసేపు మడిమ గాయంతో బాధపడిన పవన్ కల్యాణ్ అనంతరం ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం మళ్లీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. 


ప్రస్తుతం పవన్ కల్యాణ్ భీమవరంలోని ఎన్.డి.ఫంక్షన్ హాల్‌లో బస చేశారు. ముందస్తు ప్రణాళికల ప్రకారం అక్కడి నుంచే రేపు జన చైతన్య పోరాట యాత్ర ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నప్పటికీ.. మడిమ గాయంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌కు వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినందున ఈ యాత్ర ఎంతమేరకు ముందుకు సాగనుంది ఏంటనే అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.