సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం గుంటూరులో పర్యటించనున్నారు. అతిసార వ్యాధితో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించి, వారికి అండగా తాము వున్నామని చెప్పడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ పర్యటన చేపట్టినట్టు తెలుస్తోంది. అతిసార వ్యాధి బారిన పడిన బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను సందర్శించి అక్కడ బాధితులకు అందుతున్న చికిత్స, వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకోనున్నారు. అతిసార వ్యాధితో గుంటూరులో ఇప్పటివరకు 15 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. 


ఇదిలావుంటే, గుంటూరులో అతిసార వ్యాథి ప్రబలిన నేపథ్యంలో బాధితులకు తక్షణ వైద్య సహాయం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు మంత్రులు, స్థానిక అధికార యంత్రంగాన్ని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు చేరుకున్న మంత్రులు అక్కడి పరిస్థితి సమీక్షిస్తున్నారు.