తిరుపతి- రేణిగుంట రైలు మార్గంలో.. కదులుతున్న రైలు కింద పడి రిటైర్డ్ జడ్జి, ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. సుధాకర్‌(62) అదనపు జిల్లా జడ్జిగా మహబూబ్‌నగర్‌లో పనిచేస్తూ 2014లో రిటైరయ్యారు. రిటైర్ అయ్యాక తిరుచానూరులో తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం అనారోగ్య కారణాల వల్ల రైలు కిందపడి సుధాకర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన సతీమణి వరలక్ష్మి కూడా అదే ప్రదేశంలో సాయంత్రం రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. దంపతుల మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


కాగా దంపతులిద్దరికీ కుమారుడు సందీప్, కుమారై అజిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సందీప్‌ ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.