పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, స్థానిక శివాలయం కమిటీ చైర్మన్ గొడవర్తి కృష్ణ భగవాన్ మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. శివరాత్రి ఉత్సవాల కోసం శివాలయం పరిసరాల్లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న క్రమంలోనే కృష్ణభగవాన్‌‌ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. అక్కడే వున్న అధికారులు, ఆయన అనుచరులు కృష్ణభగవాన్‌ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. కృష్ణభగవాన్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. కృష్ణభగవాన్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. 


చాలాకాలంగా టీడీపీలో కొనసాగుతూ పార్టీకి ఎన్నో సేవలు అందించిన గొడవర్తి కృష్ణభగవాన్ మృతి పార్టీకి తీరని లోటు అని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణభగవాన్‌ మృతి పట్ల ఆ జిల్లాకి చెందిన నేతలతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.