వికారాబాద్ : ఆంధ్రా ప్రజలు మంచివాళ్లేనని.. వారితో మాకేం కిరికిరి లేదని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. చంద్రబాబు లాంటి పిడికెడు మందితో తప్ప ఏపీ ప్రజలతో మాకు ఎటువంటి పంచాయతీ లేదని చెప్పిన కేసీఆర్.. ఏపీలో జగనే గెలుస్తారని, జగన్ తో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం సాగిస్తామని తేల్చిచెప్పారు. గతంలోనూ ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీ... ఇకపై కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. వికారాబాద్‌లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్.. జగన్‌తో కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. కేసీఆర్‌తో స్నేహం చేస్తోన్న వైఎస్ జగన్.. కేసీఆర్‌తో ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై స్పష్టమైన హామీ ప్రకటన చేయించగలరా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో చేస్తున్న వ్యాఖ్యలకు ప్రతిగా స్పందిస్తూనే కేసీఆర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.  


ఏపీ ప్రత్యేక హోదాపై తామెప్పుడూ అడ్డుపడలేదని, మరోసారి తెలంగాణ గడ్డపై నుంచి చెబుతున్నాను.. ప్రత్యేక హోదాకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.