YS Jagan Stone Attack: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. `నాపై రాళ్లు వేయించింది చంద్రబాబే, పవన్ కల్యాణ్, బీజేపీనే`
YS Jagan Hot Comments On Stone Attack In Memantha Siddham Bus Yatra: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధినాయకులపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. తనపై జరిగిన రాళ్ల దాడిపై వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తొలిసారి బహిరంగ వేదికపై చర్చించారు. రాళ్ల దాడి ప్రతిపక్షాలే చేయించాయని సంచలన ఆరోపణలు చేశారు.
YS Jagan: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినాయకులపై రాళ్ల దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. మొదటిసారి దాడి జరిగింది వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్పైనే. దాడితో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న అనంతరం జరిగిన తొలి బహిరంగ సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై రాళ్ల దాడి చేయించింది ప్రతిపక్షాలేనని ఆరోపించారు. చంద్రబాబు, బీజేపీ, దత్తపుత్రుడు దాడి చేస్తున్నారని తెలిపారు. తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకుని.. ప్రతిపక్షాలు కౌరవులుగా పేర్కొన్నారు.
Also Read: Chandrababu Jagan Stone Attack: జగన్ విలాస పురుషుడు.. రాళ్ల దాడి కొత్త డ్రామా: చంద్రబాబు
'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడులో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. 'గుడివాడలో మహాసముద్రం కనిపిస్తోంది. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల మహాసంగ్రామంలో మంచి వైపు నిలబడిన ప్రజల సముద్రం ఇది' అని జగన్ పేర్కొన్నారు. పేదల భవిష్యత్ కోసం.. పథకాల కొనసాగింపు కోసం పెత్తందారులతో యుద్ధానికి మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. అబద్ధాలు, కుట్రలు, మోసాలతో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయని తెలిపారు.
Also Read: Jagan Attack: జగన్పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..
ఈ సందర్భంగా తనపై జరిగిన రాళ్ల దాడిపై జగన్ స్పందించారు. 'ఎన్నికల సంగ్రామంలో నాపై చంద్రబాబు, బీజేపీ, దత్తపుత్రుడు దాడి చేయిస్తున్నారు. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదు. జగన్పై ఒక రాయి వేసినంత మాత్రాన.. మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. వారు ఈ స్థాయికి దిగజారారంటే మనం విజయానికి చాలా చేరువుగా ఉన్నామని అర్థం' అని పేర్కొన్నారు. తనకు వారు చేసిన గాయంతో సంకల్ప బలం పెంచిందని తెలిపారు.
'నా నుదుటి మీద వారు చేసిన గాయం. నా సంకల్పాన్ని మరింత పెంచింది. ఆ దేవుడు నా స్క్రిప్ట్ పెద్దగా రాశారు. పేదలకు ఏ మంచి చేయొద్దన్నది కూటమి నాయకుడు చంద్రబాబు సిద్ధాంతం. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, బీసీలను అవహేళన చేసింది చంద్రబాబే. ప్రత్యేక హోదా వద్దని చెప్పింది కూడా చంద్రబాబే. దోచుకోవడం.. దోచుకున్నది దాచుకోవడం ఇది చంద్రబాబుకు తెలిసిన నీతి. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే' అని జగన్ తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కాలంలో తన ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రచారంలో వివరించారు. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకున్నారని వెల్లడించారు.
'ఆరోగ్య శ్రీ కార్డుతో రూ.25 లక్షల మేర ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూమి హక్కులు కల్పించాం. మనం చేసిన మార్పులతో పెత్తందార్ల కడుపు మండుతోంది. వసత దీవెన, విద్యా దీవెన, టోఫెల్ శిక్షణ అందిస్తున్నాం. జగనన్న చేదోడు, వాహన మిత్ర, లా నేస్తం వంటి పథకాలతో ప్రజలకు మేలు చేశాం. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 13 జిల్లాలను 25 జిల్లాలు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేశాం. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం' అని వైఎస్ జగన్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter