ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల గురించి స్వయంగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా పారు దేవర్లపాడు వద్ద వైఎస్ జగన్ పాద యాత్ర 1600 కి.మీ. పూర్తి చేసుకుంది. తన పాదయాత్ర 1600 కి.మీ. పూర్తి చేసుకున్న సందర్భంగా పారు దేవర్లపాడులో వైఎస్సార్సీపీ జండాను ఎగరవేసిన జగన్.. ఆ గ్రామంలో ఓ మొక్కను నాటారు. పాదయాత్రలో నేడు 121వ సందర్భంగా వైఎస్ జగన్ ఇవాళ ముప్పాళ్ల గ్రామం నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టారు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తల మధ్య వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్ జగన్ మధ్యమధ్యలో బహిరంగ సభల్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుకు సాగిపోతున్నారు.


నవంబర్ 6న ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.