Sanambatla Mysterious Fire Accidents Case Solved: హారర్ సినిమాను తలపించిన కొత్త శానంబట్ల వరుస అగ్ని ప్రమాదాల కేసుకి సినీ ఫక్కీలోనే ఎండ్ కార్డ్ పడింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో వరుసగా చెలరేగుతున్న మంటల మిస్టరీ వీడింది. వరుస అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటో తేలింది. అదే ఊరికి చెందిన కీర్తి ఇదంతా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కీర్తి తన తల్లిపై పెంచుకున్న ద్వేషంతో బంధువుల ఇళ్లు, బీరువాలకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..
ఊరిలో మొదట గడ్డి వాముకు కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఇదే అదునుగా భావించిన కీర్తి.. ఎదురింట్లో ఉన్న గడ్డివాముకు నిప్పు పెట్టినట్లు తేలింది. ఆ తర్వాత కీర్తి వరుసగా తన బంధువుల ఇళ్లలో బీరువాలకు, బట్టలకు నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఊరిలో ఏదో జరుగుతోంది అంటూ ప్రచారం జరిగింది. అదే క్రమంలో బీరువాలో బట్టలు కాలిపోయి బట్టలు కోల్పోయిన వారికి కొంతమంది నగదు సహాయం చేశారు. ఈ వరుస ఘటనల సమయంలో ఇంకొంతమంది దురాశపరులు అత్యాశకు పోయి ఎవరో ఇచ్చే నగదు సహాయం కోసం తమ పాత బట్టలకు నిప్పు పెట్టుకున్నారు. వారు కూడా కీర్తితో పాటే అత్యాశకు పోయి అరెస్ట్ అయ్యారు. ఈ మిస్టరీ వీడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


కొత్త శానంబట్లలో కొంతకాలంగా వరుసగా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఒకే కుటుంబానికి చెందిన పిల్లపాళెం దాయాదులైన శివశంకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, రవిల ఇళ్లు, పంట పొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గడ్డివాములు, బీరువాల్లో మంటలు రేగడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనల్లో బట్టలతో పాటూ డబ్బులు, బంగారం కూడా దగ్థం అయ్యాయి. ఇలా వరుస ఘటనలు జరగడంతో గ్రామానికి క్షుద్రపూజలు జరిగాయని అనుమానించారు. స్థానికులు వెంటనే మంత్రగాళ్లను ఆశ్రయించి.. ఊరిలో గంగమ్మకు పూజలు నిర్వహించారు. ఈ పూజలు కొనసాగుతున్న సమయంలోనే మరో ఇంట్లో మంటలు రేగాయి.


ఈ ఘటనలకు తోడు ఓ వ్యక్తి గ్రామానికి వచ్చి భిక్షాటన చేశాడట. తనకు తక్కువ నగదును భిక్షగా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించాడట. అతడే గ్రామస్తులపై కోపంతో ఏదైనా క్షుద్రపూజలు చేసి ఉండొచ్చని.. ఈ మంటల వెనుక అతడే ఉండి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఈ వరుస ఘటనలపై ఆరా తీశారు. క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ముందస్తు జాగ్రత్తగా కొంతమంది పోలీసుల్ని కూడా మోహరించారు.


అక్కడితో ఈ మిస్టరీ ఆగలేదు.. 40 ఏళ్ల క్రితం కూడా కొత్త శానంబట్లలో ఇదే తరహాలో ఘటనలు జరిగాయని ఊరిలో పెద్దవాళ్లు చర్చించుకున్నారు. తాంత్రిక ప్రయోగం వల్ల వరుసగా ఇళ్లలో మంటలు చెలరేగాయని ప్రచారం జరిగింది. అయితే చివరికి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందని తెలిసి స్థానికులు కూడా అవాక్కయ్యారు. కీర్తి తల్లిపై ద్వేషంతో ఇదంతా చేసింది అని అసలు నిజం తెలిశాకా తొలుత షాక్ కి గురైనప్పటికీ.. ఈ మంటల వెనుక ఎలాంటి క్షుద్రపూజలు లేవనే నిజం నిగ్గుతేలడంతో గ్రామస్తులు అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కొత్త శానంబట్లలో వరుస అగ్ని ప్రమాదాల గురించి కథకథలుగా చెప్పుకున్న వాళ్లంతా.. ఆ ఘటనల వెనుక ఒక ఆడపిల్ల ఉందని తెలిసాకా ముక్కున వేలేసుకున్నారు.