ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.  ఓ బ్రెయిన్ ట్యూమర్ పేషెంటుకి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో తనకు బాహుబలి 2 చిత్రాన్ని చూపించాల్సి వచ్చింది. విషయాల్లోకి వెళితే.. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 43 ఏళ్ల వినయ కుమారి అనే మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ, ఆ ఆసుపత్రిలోని స్పెషల్ వార్డులో ట్రీట్ మెంట్ పొందుతోంది. అయితే వైద్య నియమాల ప్రకారం, ఆ  బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసేటప్పుడు కచ్చితంగా రోగి మేల్కొనే ఉండాల్సిన పరిస్థితి ఉండడంతో.. తనకు కాస్త ఉపశమనం కలిగించేందుకు.. మరియు తన దృష్టి మరల్చే వాతావరణం కల్పించేందుకు, ఆమెకు చిన్న స్క్రీన్ మీద సినిమా చూపించే ఏర్పాటు చేశారు డాక్టర్లు. రోగి కూడా ఆపరేషన్ జరుగుతున్నంత సేపు, ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమా చూసిందని..అందుకు తమ పని సులువైందని డాక్టర్లు తెలిపారు. దాదాపు గంట సేపు జరిగిన ఆపరేషన్ రోగికి ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదని, ఆమె అసలు భయం పడకుండా.. సినిమా చూడడంలో లీనమై, పూర్తిగా సహకరించిందని న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.