మెగాస్టార్ నటించిన తొలిచిత్రం "పునాదిరాళ్ళు". 1978లో ఈ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం అదే పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు రచయిత గౌతమ్ రావూరి. చిరంజీవి సినిమాలకు సంబంధించిన ప్రత్యేకతలు, ఆయన కెరీర్‌కు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు, కీలక సంఘటనలు మొదలైన వాటికి ఆ పుస్తకంలో చోటు కల్పించారు. ఇటీవలే ఈ పుస్తకాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ఆవిష్కరించారు.


40 ఏళ్ళ చిరంజీవి నట జీవన ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ పుస్తకాన్ని రాసినట్లు రచయిత తెలిపారు. ఈ పుస్తకం రెండు భాగాలుగా విడుదల అవుతుందని.. తొలి భాగాన్ని ప్రస్తుతం విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. 1979లో విడుదలైన "పునాదిరాళ్ళు" చిత్రం ఉత్తమ చిత్రంగా అప్పట్లో నంది అవార్డు గెలుచుకుంది. రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం "పునాదిరాళ్ళు" అయినా, ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి చిత్రం "ప్రాణం ఖరీదు" అనే చెప్పుకోవచ్చు.