బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన అభిమానులకు ఈద్ కానుకగా పండగకన్నా ఒక రోజు ముందే జీరో టీజర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న జీరో సినిమాలో షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న షారుఖ్ ఖాన్ అందుకు తగినట్టుగానే ఈ టీజర్‌లో తన యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అన్ని విభేదాలను పక్కనపెట్టి ఒక్కసారి కలిసి తెరపైకొస్తే, ఆ సీన్ ఎంత నిండుగా ఉంటుందనే విషయాన్ని ఈ టీజర్ మరోసారి నిరూపించింది. అన్నింటికన్నా ముఖ్యంగా 'ఈ ఇద్దరు హీరోల తరఫున యావత్‌ హిందుస్థాన్‌కు ఈద్‌ ముబారక్‌' అనే డైలాగ్ ఆ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ట్యూబ్ లైట్ సినిమాలో షారూఖ్ ఖాన్ ఓ అతిథి పాత్ర‌లో కనిపించగా ఆ తర్వాత తాజాగా బాద్‌షా కోసం స‌ల్లూ భాయ్ జీరో సినిమాలో అతిథి పాత్రలో సందడి చేయడం విశేషం‌. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమా తరహాలోనే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌తోపాటు దీపికా పదుకునే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ వంటి టాప్ హీరోయిన్స్ సైతం తళుక్కుమననున్నారు. అంతమందిని ఒకేసారి తెరపై చూడాలనుకున్నా, ప్రస్తుతం మన మధ్యలో లేని శ్రీదేవిని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడాలనుకున్నా 2018 డిసెంబర్ 21న జీరో సినిమా ఆడియెన్స్ ముందుకొచ్చే వరకు వేచిచూడక తప్పదు.