తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేయడం కోసం పోరాడిన తెలుగు బిడ్డగా స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావుకి గొప్ప పేరు వున్న సంగతి తెలిసిందే. తెలుగు వారికి అవమానం జరిగిన ప్రతీ చోట తాను ముందుండి వారి తరపున పోరాటం చేస్తానని అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ప్రకటన ఆ కథా నాయకుడిని మహానాయకుడిగా మార్చింది. అటువంటి సన్నివేశాలు ఎన్.టి.ఆర్ బయోపిక్‌లో పుష్కలంగా వున్నాయని చెబుతున్న ఆ చిత్ర యూనిట్ తాజాగా మరో రిలీజ్ ప్రోమోను విడుదల చేసింది. ఒకదానితర్వాత మరొకటిగా విడుదలవుతున్న రిలీజ్ ప్రోమోలలో ఇది నాలుగవది. "దక్షిణ భారతీయులంతా మద్రాసీలు కాదు.. మేం ఆంధ్రావాళ్లం.. మాకూ ఆత్మ గౌరవం ఉంటుంది, మాకూ ఆత్మాభిమానం, ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు వుంటాయి" అని ఎన్టీఆర్ అప్పుడు కేంద్రంతో పోరాడిన ఘట్టాన్ని ఈ ప్రోమోలో చూపించారు. జనవరి 9న విడుదల కానున్న కథా నాయకుడు సినిమాకు సంబంధించిన ఈ ప్రోమోపై మీరూ ఓ కన్నేయండి.