పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని మళ్లీ సినిమా చేస్తారని ఇప్పటికే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన హిందీ రీమేక్ పింక్ చిత్రంలో నటిస్తారని దాదాపుగా ఖరారైనట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు పవర్ స్టార్..  పింక్ చిత్రానికి సంబంధించి మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన పింక్ సినిమా కోసం కేవలం 21 రోజులు మాత్రమే కాల్‌షీట్లు ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ మేరకు దర్శక నిర్మాతలకు పవన్ సూచించినట్లుగా చెబుతున్నారు. ఐతే దీనిపైనా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


హిందీలో పింక్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో నిర్మించాలని ప్రముఖ హిందీ నిర్మాత బోనీ కపూర్ సంకల్పించారు. తెలుగులో దిల్ రాజుతో కలిసి సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరగుతోంది. ఆయన సరసన హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి, అనన్య పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే వీరిని కూడా దర్శక నిర్మాతలు ఫైనల్ చేయాల్సి ఉందని సమాచారం.