న్యూఢిల్లీ: తనుశ్రీ దత్తా-నానా పటేకర్‌ వివాదం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నానా పటేకర్‌ 2008లో ‘హర్న్‌ ఓకే ప్లీజ్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  పలువురు హీరోయిన్లు, నటులు తనుశ్రీకి మద్దతుగా నిలవగా, మరికొందరు పాటేకర్‌పై ఆమె చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తనుశ్రీ వ్యాఖ్యలపై శక్తికపూర్‌ స్పందించారు. 'నేను నిన్ననే విదేశాల నుంచి వచ్చాను. నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. అది పదేళ్ల కిందటి సంగతి. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని' అని చమత్కరించారు. శక్తి కపూర్ వ్యాఖ్యలపై కొందరు మండిపడుతుండగా.. మరికొందరు స్టార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి వెనకడుగు వేస్తున్నారని మరికొందరు అంటున్నారు.


కాగా సోనం కపూర్‌, ట్వింకిల్‌ ఖన్నా, ప్రియాంక చోప్రా, ఫర్హాన్‌ అక్తర్‌, సిమీ గరేవాల్‌, అనురాగ్‌ కశ్యప్‌, పూజా భట్‌, రవీనా టాండన్‌, కొయినా మిత్రా వంటి పలు నటీనటులు తనూశ్రీకి మద్దతు తెలపగా, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి నటులు ఈ వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు.


అటు.. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు. వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే వేధింపుల వ్యవహారన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. మహిళల భద్రతపట్ల కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందన్న ఆమె ఇకపై మహిళలు ఏ చిన్న వేధింపులకు గురైనా తమ దృష్టికి తీసుకురావొచ్చని అన్నారు.


మరోవైపు..గతంలో పటేకర్‌ గురించి నటి డింపుల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పటేకర్‌ గురించి యాంకర్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘నాకు తెలిసి అతడు దుర్మార్గుడు. అతడు గొప్ప నటుడే. వ్యక్తిగతంగా అతడు చాలా స్నేహంగా ఉంటారు. కానీ అతడి జీవితంలో ఓ చీకటి కోణం కూడా ఉంది. నటుడిగా అతడిపై నాకున్న అభిప్రాయం ఇది’ అని కుండలు బద్ధలు కొట్టింది.