అలనాటి నటి శ్రీదేవి అకాల మరణంపై పలు రకాల అనుమానులు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆమె మరణానికి గల కారణాన్ని తేల్చి చెప్పారు. ఆమె మరణం గుండెపోటు వల్ల సంభవించిందని.. ఇందులో ఎవరూ అనుమానించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శ్రీదేవి మరణించిన వెంటనే ఆమె మరణంపై పలు రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. అందంగా ఉండేందుకు ఆమె చేయించుకున్న శస్త్రచికిత్సల వల్లే ఆమె మరణించారని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇలా మొదలై.. ఎవరికి తోచినట్లుగా వారి అభిప్రాయాలు తెలియజేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నివేదిక ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది..