ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం సాధించడంతో అటు ఆ చిత్ర హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ ఇద్దరూ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఆ సినిమాను కాదనుకుని డియర్ కామ్రేడ్ సినిమా చేసిన విజయ దేవరకొండకు మాత్రం ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందివ్వలేకపోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా బడ్జెట్, సినిమాలో హీరో లాంగ్వేజ్ నచ్చకపోవడం వల్లే అప్పుడు ఆ సినిమాను కాదనుకున్నాడట విజయ్ దేవరకొండ. కానీ ఇస్మార్ట్ శంకర్ ఫలితం చూశాకా విజయ్ దేవరకొండ దృష్టి తాజాగా పూరి జగన్నాథ్‌పైనే పడిందట. 


తనకు మరో ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ విజయ్ దేవరకొండ చేసిన విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం పూరి జగన్నాథ్ మరో స్క్రిప్ట్ రాసుకునే పనిలో పడినట్టు టాలీవుడ్ టాక్. విజయ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాథవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. క్రాంతి మాధవ్‌తో సినిమా పూర్తి కాగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనేది ఆ టాక్ సారాంశం. అదే కానీ నిజమైతే, బ్లాక్ బస్టర్ మాస్ హిట్ చిత్రాలను తెరకెక్కించే పూరి దర్శకత్వంలో తమ హీరో సినిమా రానుండటం విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా సంతోషించదగిన వార్తే అవుతుంది.