మహేష్ బాబుతో సినిమా చేయనుండటంపై ప్రముథ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. గత 13 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో కొనసాగుతోన్న విజయశాంతి తిరిగి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేష్ బాబు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై ఆమే స్వయంగా స్పందించారు. తాను మహేష్ బాబు హీరోగా రానున్న 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి పునఃప్రవేశం చేస్తున్నానని అంగీకరించారామె. దైవ సంకల్పమో, లేక తనను దీవించిన ప్రజల అభిమానం ప్రభావమో తెలియదు కానీ అంతిమంగా తాను సినిమాల్లోకే రావడం రాసిపెట్టి ఉందన్నట్టుగా అభిప్రాయపడ్డారామె.


ఈ సందర్భంగా తన నట ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అప్పటి సూపర్ స్టార్ కృష్ణతో చేసిన కిలాడి కృష్ణుడు సినిమాకన్నా ముందుగానే తాను 9 సినిమాలు చేసినప్పటికీ.. వాటికన్నా కృష్ణతో కలిసి చేసిన సినిమానే బాగా పేరు తీసుకొచ్చిందని చెప్పారామె.