సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో వున్న ఓ కోచింగ్ సెంటర్ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటనలో మొత్తం 16 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. తక్షశిలా కాంప్లెక్స్ భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో చెలరేగిన మంటలు క్షణాల్లోనే ఆ రెండు అంతస్తులకు పూర్తిగా వ్యాపించాయి. దీంతో ఏం చేయాలో తెలియని బాధితులు ఆర్తనాధాలు పెడుతూ అక్కడి నుంచి దూకేయడం టీవీఛానెళ్లలోని దృశ్యాల్లో కనిపించింది. 


సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకుని సహాయచర్యలు ముమ్మరం చేశారు. 19 ఫైర్ ఇంజిన్స్, రెండు హైడ్రాలిక్ క్రేన్స్ సహాయచర్యలకు ఉపయోగిస్తున్నట్టు అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.