అరుణాచలప్రదేశ్‌లో రెండు నియోజకవర్గాల్లో జరిగిన బైపోల్స్‌లో బీజేపీ గెలిచి తన సత్తా చాటింది. ప్రస్తుతం అరుణాచల్ అసెంబ్లీలో గల 60 సీట్లలో 49 బీజేపీవే కావడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్‌లోని పక్కే కెసాంగ్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బీఆర్ వాఘే తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కెమెంగ్ డొలోపై 475 ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం. 


2014 ఎన్నికల్లో గెలుపొందిన కెమెంగ్ డొలో ఎన్నికపై నమోదైన పిటీషన్ పై గౌహతి హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఆ ఎన్నిక చెల్లదని చెప్పిన మీదట... ఇటీవలే ఈ నియోజకవర్గంలో మళ్లీ బైపోల్స్ నిర్వహించడానికి సంకల్పించింది ఎన్నికల కమీషన్. అలాగే అరుణాచల్ ప్రాంతంలోని మరో నియోజకవర్గమైన లికిల్ బాలి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కర్డియో నిగోర్ తన సమీప పీపుల్స్ పార్టీ అభ్యర్థిపై కూడా 296 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితమవడం గమనార్హం.