న్యూఢిల్లీ : షాహీన్ బాఘ్ నిరసనకారులపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా షాహీన్ బాఘ్‌లో జరుగుతున్న ఆందోళనలు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పనేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాఘ్‌లో ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో తాజాగా అక్కడి నిరసనలపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. ''మీకు జిన్నా వలీ ఆజాదీ' కావాలో.. లేక 'భారత్ మాతా కీ జై' కావాలో తేల్చుకోండి' అని వ్యాఖ్యానించారు. షాహీన్ బాఘ్‌ ఆందోళనల్లో జిన్నా వలీ ఆజాదీ అనే నినాదాలు వినిపిస్తున్నాయని.. అందుకే ఇక ''మీకు జిన్నా వలీ ఆజాదీ కావాలో లేక భారత్ మాతా కీ జై కావాలో తేల్చుకోండి'' అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన వ్యాఖ్యలు వింటే.. ''షాహీన్ బాఘ్ నిరసనల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉంది'' అని అర్థమవుతోందని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Related news : దేశవ్యాప్తంగా మరెన్నో షాహీన్ బాగ్స్ వస్తున్నాయి: నటి నందితా దాస్


పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతోన్న సందేహాలు, అపోహలపై మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. ఈ చట్టం వల్ల ఎవ్వరూ పౌరసత్వాన్ని కోల్పోరని అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన వారికోసమే ఈ చట్టం అని తేల్చిచెప్పిన కేంద్ర మంత్రి.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో వారు తీవ్ర వేధింపులు ఎదుర్కుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారని అభిప్రాయపడ్డారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..