జమ్ము కాశ్మీర్ కొత్త డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత కవిందర్ గుప్తాను నియమించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ రిజైన్ చేయడంతో ఆయన స్థానంలో కవిందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జమ్ము కాశ్మీర్‌లో ప్రస్తుతం పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో కలిసి బీజేపీ సంయుక్త ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 17వ తేదిన బీజేపీ అధిష్టానం కాశ్మీర్ ప్రభుత్వంలో ఉన్న తమ మంత్రులందరినీ రాజీనామా చేయమని కోరింది. అప్పటికే కథువా ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. అంతకు ముందే ఆ ఇద్దరు మంత్రులు కథువా ఘటనలో పోలీసు ఎంక్వయరీకి వ్యతిరేకంగా నిరసన తెలపడం గమనార్హం. తర్వాత ఆ మంత్రుల్లో ఒకరైన చంద్ర ప్రకాష్ గంగ మాట్లాడుతూ తనను తన పార్టీ బలిపశువును చేసిందని పేర్కొన్నారు. 


ఈ క్రమంలో ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ క్యాబినెట్‌లో బీజేపీకి సంబంధించిన కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. అందుకే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న నిర్మల్ సింగ్ చేత రిజైన్ చేయించి కవిందర్ గుప్తాకి అవకాశమిస్తోంది. మిగతా వారి విషయంలోనూ ఇదే పద్ధతిని అనుసరించనుంది. ఏప్రిల్ 30వ తేది మధ్యాహ్నం 12 గంటలకల్లా జమ్ము కాశ్మీర్ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది