Rahul gandhi news : టార్గెట్ 2024.. వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములతో పార్టీ అంతర్మథనంలో పడింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి అంశాలతో ప్రజల ముందుకెళ్లాలనే దిశగా రాజస్థాన్‌ ఉదయ్‌పుర్ చింతన్ శివర్ వేదికగా  కాంగ్రెస్ మేధోమథనం చేస్తోంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ నవ సంకల్ప్‌ చింతన్ శివిర్‌ సమావేశాల్లో తొలి రోజు పార్టీ పునర్ వ్యవస్థీకరణ, వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపై చర్చించారు. ఇదే వేదికగా పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై సవివరంగా చర్చించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఉదయ్‌పుర్ చింతన్ శివర్‌లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యులు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సీడబ్లుసీ సభ్యులతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటు రాహుల్ గాంధీతో నేతలంతా సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్ష నేతలతో సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలనే చర్చల్లో రాహుల్ గాంధీ జనజాగరణ యాత్ర చేపట్టాలని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దేశంలో నెలకొన్న ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాడుతూనే... రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. అన్ని సమస్యలపై రోడ్లపై పోరాటం మొదలు పార్లమెంటులో గళం విప్పే వరకు ఏ స్థాయిలో అయినా రాజీలేని పోరాటం చేయాలని కాంగ్రెస్ చింతన్ శివిర్‌లో నిర్ణయించింది. ఈ అంశాన్ని సీడబ్లూసీ ముందుంచి తీర్మానం చేయనున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్య, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని, సరిహద్దు భద్రత, సరిహద్దు ఉద్రిక్తత వంటి అంశాలపై ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది.


ప్రజల సమస్యలపై పోరాటం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీని పటిష్టం చేయటమే లక్ష్యంగా రానున్న రెండేళ్లపాటు ఈ ప్రజాచైతన్య యాత్ర కొనసాగాలని యోచిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో పార్టీ జన జాగరణ ఆందోళనను తమదైన రీతిలో అమలు చేయాలని నేతలు కోరారు. బస్సుయాత్రలు, పాదయాత్రలు వంటివి చేపట్టి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నారు నేతలు.


కాంగ్రెస్‌ నవ సంకల్ప్ చింతన్ శిబిరంలోనే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించాలనే డిమాండ్ పెద్ద యెత్తున వినిపించినట్లు తెలుస్తోంది. పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీకి అప్పగించి... ఆయన రైలులో తిరుగుతూ దేశమంతా పర్యటించి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటే పార్టీకి బాగుంటుందనే అభిప్రాయం కొందరు నేతల నుంచి వ్యక్తమైంది. చింతన్ శివిర్‌లో వివిధ రాజకీయ అంశాలపై మేధోమథనం చేస్తున్న కమిటీలో చర్చ సందర్భంగా కొందరు నేతలు రాహుల్‌కు పగ్గాలు అప్పగించి యువ నాయకత్వానికి పట్టం కట్టాలనే సూచన చేసినట్లు సమాచారం.


ఇప్పటికే వచ్చే లోక్‌ సభ ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆయా రాష్ట్రాల్లో పొత్తులపై ఎలాంటి వ్యూహాలు రచించాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను సైతం పార్టీలో చేరాలని ఆహ్వానించింది కాంగ్రెస్. 2024 ఎన్నికల్లో 370 స్థానాల్లో గెలుపొందేందుకు ప్రశాంత్ కిశోర్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. అయితే ప్రశాంత్ కోరిన విధంగా ఎన్నికల పగ్గాలు పూర్తిగా అప్పగించకపోవటంతో ప్రశాంత్ కాంగ్రెస్‌లో చేరలేదు. కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరం ఉందంటూ... తాను పార్టీలో చేరటం కంటే పార్టీలో తరతరాలుగా వేళ్లూనుకున్న విధానాలు కొన్ని మార్చుకుని ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు దిశగా కృషి చేస్తే కాంగ్రెస్‌కు అధికారం పెద్ద కష్టమేం కాదంటూ ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాహుల్‌ను మరోసారి ఎన్నుకుంటారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.


Also Read - Varshini About Srikanth Reddy: కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?


Also Read - Karate Kalyani Reaction : అమ్మాయిలను ఎక్కడెక్కడో టచ్‌ చేస్తూ ప్రాంక్ విడియోలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.