న్యూఢిల్లీ : 2020వ సంవత్సరానికిగాను 71వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని తాజాగా కేంద్ర సర్కార్ విశిష్ట పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను 141 మందికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. దివంగత నేతలైన జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఆధ్యాత్మికవేత్త విశ్వేశ్వర తీర్థ స్వామీజీలకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించి కేంద్రం వారిపై గౌరవాన్ని చాటుకుంది. అలాగే దివంగత నేత మనోహర్ పారికర్‌కి సైతం మరణానంతరం పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి పద్మ పురస్కారాలు వరించాయి. 


క్రీడా విభాగంలో పీవీ సింధుకు పద్మ భూషణ్‌, వ్యవసాయ రంగంలో చింతల వెంకట్ రెడ్డికి పద్మశ్రీ , విద్య-సాహిత్య రంగానికి సంబంధించి విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీ , కళల విభాగంలో యడ్ల గోపాల రావు, దలవాయి చలపతి రావులకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.