న్యూఢిల్లీ: ఉత్తరాదిపై చలి పంజా విసురుతున్నది. చలిగాలులు, దట్టంగా కురుస్తున్న మంచుతో ఉత్తర భారతం వణుకుతున్నది. మధ్యాహ్నం అయినా సరే ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఉత్తరప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం కనిపి స్తున్నది. డిసెంబర్‌ రెండో వారం మొదలు కాగానే చలి పులి పంజా విప్పినట్టుగా వాతావరణం
మారిపోయింది. ఎన్నాడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 


ఢిల్లీలో ఈ ఏడాది డిసెంబర్ సగటు ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల సెల్సియన్‌లుగా నమోదైందనీ, వందేండ్లలో ఇదే రెండో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతగా రికార్డుకెక్కిందని వాతావరణ అధికారులు తెలిపారు. గతంలో దేశ రాజధానిలో 1997 డిసెంబరు సరాసరి ఉష్ణోగ్రతలు 17.3 డిగ్రీలు సెల్సియస్‌. 1901 నుంచి ఇదే ఇప్పటి వరకు ఉన్న అత్యల్ప ఉష్ణోగ్రతని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే శనివారం రాత్రి ఉష్ణోగ్రత అతి తక్కువగా 8.5 నుంచి 9.6 డిగ్రీలు నమోదైనట్టు, కనిష్ట గరిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య తేడా 1.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు వాతావరణ అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో 9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందన్నారు. అంతేకాదు, ఉపరితల ద్రోణి ప్రభావంతో డిసెంబరు 31 నుంచి జనవరి 3 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని వెల్లడించారు రాజస్థాన్‌లోని ఫతేపూర్‌లోని ఉష్ణోగ్రతలు మైనస్‌ 3 డిగ్రీల దిగువన నమోదవు తున్నాయి. డిసెంబరు 29 వరకు శీతల గాలులు, పొగమంచు ఢిల్లీ, పంజాబ్‌, హర్యానాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతున్నది. దీంతో దాదాపు 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్న ట్టు అధికారులు తెలిపారు చిన్న పిల్లలు, వృద్ధులు, షుగర్‌, బీపీ, గుండెపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారంతా రక్షణ చర్యలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప సుదూర ప్రయాణం, ఎక్కువ సమయం తీసుకునే పనులు పెట్టుకోకూడదని చెబుతున్నారు. కాలుష్య స్థాయిల విషయానికొస్తే,ఇప్పటివరకు ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ అత్యంత పేలవంగా 495 పాయింట్లుగా నమోదయ్యిందని ఇదే పరిస్థితి కొనసాగితే గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిపోతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.