భారతదేశంలో కూడా ఇస్లామిక్ బ్యాంకింగ్ ప్రారంభించాలన్న అంశంపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. ఇదే అంశంపై వచ్చిన సమాచార హక్కు చట్టం పిటీషన్ పై సెంట్రల్ బ్యాంకు వివరణ ఇచ్చింది. భారతదేశంలో పౌరులందరికీ లభించే ఒకే విధమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల నిబంధనలకు పరిశీలించిన మీదట, ఇస్లామిక్ బ్యాంకింగ్ అవసరం ఇక్కడ లేదని అనుకుంటున్నామని తెలిపింది. ఇస్లామిక్ బ్యాంకింగ్ లేదా షరియా బ్యాంకింగ్ పద్ధతిలో వడ్డీ ఆశించకుండా రుణాలు మంజూరు చేసే సౌలభ్యం ఉంది. అయితే అటువంటి బ్యాంకింగ్ అవసరం ప్రస్తుతం భారతదేశానికి అవసరం లేదని ఆర్బీఐ తన జవాబులో పేర్కొంది. 2008లో తొలిసారిగా ఆర్థిక రంగ సంస్కరణల కమిటీ వడ్డీ రహిత బ్యాంకింగ్ సిస్టమ్ అవసరం గురించి మాట్లాడింది. కొన్ని నమ్మకాలకు అనుగుణంగా వడ్డీలు వసూలు చేయడం అనేది నైతిక ధర్మం కాదు. ఒకవేళ అలాంటి సిస్టమ్ భారతదేశంలో లేకపోతే అవే నమ్మకాలు గల వ్యక్తులు బ్యాంకింగ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని కమిటీ తెలిపింది. అయితే ఇంకా ఆ అంశం పరిశీలన దశలోనే ఉంది.