భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రేపు ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని  రాజ్ పథ్ కూడా గణతంత్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబైంది. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్.. భారత్ పై అభిమానాన్ని చాటుకుంది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా త్రివర్ణంతో కూడిన ఈమోజీని ఏర్పాటు చేసింది. #RepublicDay హ్యాష్ ట్యాగ్ తో కూడిన త్రివర్ణ ఈమోజీలో ఇండియా గేట్ కూడా ఉండడం విశేషం. 
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవానికి భారీ భద్రత ఏర్పాట్లు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు.. ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే హెచ్చరికలు. .  ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. అదనంగా 48 కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లను పిలిపించారు. ఢిల్లీలోని దాదాపు 22 వేల మంది పోలీసులు కూడా నిత్యం పహారా కాస్తున్నారు. యూనిఫామ్ తోపాటు సివిల్ డ్రెస్సుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. రోడ్లపై అన్ని వాహనాలను ఆపి .. సోదాలు చేస్తున్నారు.  అదనంగా SWAT teams కూడా రంగంలోకి దిగాయి. పోలీసులకు బాడీ వోర్న్ కెమెరాలు ఇచ్చారు.
మూడంచెల భద్రత 
రిపబ్లిక్ డే పరేడ్ జరిగే రాజ్ పథ్ వద్ద భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.  అక్కడ మూడంచెల భద్రతా విధానాన్ని నిర్వహిస్తున్నారు. భద్రతా సిబ్బంది ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో నిత్యం పరిశీలిస్తున్నారు. ఎన్ఎస్ జీ, ఎస్పీజీ, ఐటీబీపీ సిబ్బంది ఒకరినొకరు పరస్పర సహకారం అందించుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..