దేశంలో మళ్లీ స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. రాజస్థాన్‌లో గడిచిన ఏడాది కాలంలో 88 మంది స్వైన్‌ ఫ్లూ బారిన పడి ప్రాణాలు వదలగా మరో వెయ్యి మందికిపైగా జనానికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ వున్నట్టు గుర్తించారు. ఇదే విషయమై జనవరి 20వ తేదీనే మీడియాతో మాట్లాడిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ వి.కే. సింగ్ మాథుర్.. " స్వైన్ ఫ్లూ వ్యాధిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని సౌకర్యాలతో సిద్ధంగా వున్నాయి" అని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో‌నే సుమారు 400 మందికిపైగా జనం స్వైన్ ఫ్లూ బారిన పడటంతో జనవరి 3నే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఓ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగాన్ని, యావత్ ప్రజానికాన్ని అప్రమత్తం చేస్తూ పలు ఆదేశాలు జారీచేసింది.  


2017 జనవరి నెల నుంచి ఇప్పటివరకు రాజస్థాన్‌లో సుమారు 11,721 మందికి పైగా జనానికి ఆరోగ్య పరీక్షలు చేయగా అందులో సుమారు వెయ్యి మందికిపైగా జనం స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్టు తేలింది.