Golden Treasure in Jaigarh Fort Jaipur: రాజస్థాన్‌లోని జైఘడ్ కోట.. ఎన్నో రహస్యాలను తనలో నింపుకున్న ఈ కోట గురించి ఎన్నెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మొఘలుల కాలంలో ఈ జైఘడ్ కోటలో భారీ మొత్తంలో నిధి దాగి ఉండేదని, ఆ మొత్తం నిధిని భారత సైన్యం 60 ట్రక్కులలో ఢిల్లీకి తరలించడానికి మూడు రోజుల సమటం పట్టిందని చెబుతుంటారు. ఇంతకీ ఈ నిధి ఎక్కడిది.. ఆ ఖజానాను అక్కడి దాచిపెట్టింది ఎవరు ? ఈ నిధి గురించి అక్కడ ప్రచారంలో ఉన్న అంశాలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జైఘడ్ కోటలో భారీ మొత్తంలో బంగారం నిధి లభించిందని.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే.. ఇంకా చెప్పాలంటే ఎమర్జెన్సీ విధించిన సమయంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆ నిధిని తవ్వు తీశారని.. ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఆ ప్రచారంపై కానీ లేదా ఆ ప్రశ్నలకు కానీ భారత ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవట. 


అయితే, స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, జైఘడ్ కోటను ఎమర్జెన్సీ సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ తవ్వి తీశారట. అంతకంటే ముందే ఆ కోటను తమ ఆధీనంలో పెట్టుకున్న అప్పటి జైపూర్ మహారాణి గాయత్రీ దేవికి, ఇందిరా గాంధీ కుటుంబానికి మధ్య సంబంధాలు క్షీణించిన తరుణం అది.


1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గాయత్రీ దేవి కాంగ్రెస్‌ను ఓడించి జైపూర్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గాయత్రి దేవి కాంగ్రెస్‌పై విజయం సాధించారు. ముఖ్యంగా అప్పటికే శక్తివంతురాలిగా పేరున్న ఇందిరా గాంధీని.. ఇంకా చెప్పాలంటే మహమహులే ఇందిరా గాంధీకి ఎదురెళ్లాలంటే భయపడే పరిస్థితులున్న ఆ రోజుల్లో గాయత్రి దేవి ధైర్యంగా ఇందిరకు వ్యతిరేకంగా బహిరంగంగా ఉపన్యాసాలు చేసేవారు. ఇవన్నీ ఇందిరా గాంధీకి గాయత్రి దేవికి శత్రువును చేశాయనే ప్రచారం ఉంది. 


అందుకే ఎమర్జెన్సీ సమయంలో గాయత్రీ దేవితో పాటు ఆమె కుమారుడు బ్రిగేడియర్ భవానీ సింగ్ ని ఢిల్లీ జైలులో బంధించి, అప్పటి భారత ప్రభుత్వం సైన్యాన్ని జైఘడ్ కోటపైకి పంపించిందిట. జైఘడ్ కోటను చుట్టుముట్టిన భారత సైన్యం.. దాదాపు వారం రోజుల పాటు అక్కడ కర్ఫ్యూ విధించి, కోట సమీపంలోకి ఎవ్వరినీ రానివ్వకుండా చూసుకుంటూ ఏడు రోజుల పాటు తవ్వకాలు జరిపారని చెబుతుంటారు. ఈ తవ్వకాల్లో బయటపడిని నిధిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ఇండియన్ ఆర్మీకి చెందిన 60 ట్రక్కులను ఉపయోగించారని.. అయినప్పటికీ ఆ నిధిని తరలించేందుకు మూడు రోజుల సమయం పట్టిందని చెబుతుంటారు.


ఇది తెలిసి వాటాకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని
అది 1976 కాలం. అప్పట్లో పాకిస్థాన్‌కి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానిగా ఉన్నాడు. 1976 ఆగస్టు 11న జుల్ఫికర్ అలీ భుట్టో ఆనాటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి ఒక లేఖ రాశారని... 1947లో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. జైఘడ్ కోటలో దొరికిన నిధిలో సగం వాటా మాకు కూడా ఉంటుందని అందులో పేర్కొన్నారట. స్వాతంత్య్రానికి ముందు నుండే ఉన్న నిధి కావడంతో అందులో భారత్, పాకిస్థాన్ లకు సమాన వాటా ఉంటుందని.. ఆ ఒప్పందం ప్రకారం మా సగం వాటా మాకు కావాలి అని జుల్ఫికర్ అలీ బుట్టో డిమాండ్ చేశాడట. 


అయితే, భుట్టో రాసిన ఆ లేఖకు వెంటనే స్పందించిన ఇందిరా గాంధీ.. కొన్ని నెలల తర్వాత భుట్టో లేఖకు స్పందిస్తూ లేఖ రాశారని.., మీరు చెబుతున్నట్టుగా తమకు ఎలాంటి నిధి దొరకలేదని అందులో బదులిచ్చారట. నిధి దొరకలేదు కాబట్టి అందులో వాటా అనే ప్రశ్నే లేదని తేల్చిచెప్పిన ఇందిరా గాంధీ.. అంతటితో ఊరుకోకుండా మరో షాక్ ఇచ్చారట. ఏదేమైనా న్యాయ నిపుణుల సలహా ప్రకారం ఆలోచిస్తే.. 1947 నాటి ఒప్పందం ఏదైనా.. దానికి మేం ఇంకా బాధ్యత వహించే ప్రసక్తే లేదని ఖరాఖండిగా తేల్చిచెప్పారట.


అంత నిధి ఎక్కడి నుంచి వచ్చింది
జైపూర్‌కి సమీపంలోని అమెర్‌లో ఉన్న ఈ జైఘడ్ కోటలో ఉన్న నిధి 500 సంవత్సరాల క్రితం నాటిదని అక్కడి చరిత్రకారులు చెబుతుంటారు. 1581లో అప్పటి చక్రవర్తి అక్బర్ తన ఆస్థానంలో ముఘల్ జనరల్‌గా, మంత్రిగా పనిచేస్తోన్న మాన్‌ సింగ్‌ను ఒక ప్రత్యేకమైన పని మీద ఆఫ్ఘన్ మిషన్‌కు పంపించాడని చరిత్రకారులు చెబుతుంటారు. అక్కడి తిరుగుబాటుదారులను అణిచివేయడంలో మాన్ సింగ్ విజయం సాధించాడు. అయితే, అదే సమయంలో రాజపుత్రుల సైన్యం అక్కడి నిధిని కొల్లగొట్టగా.. మాన్‌సింగ్ వచ్చి ఆ నిధిని జైఘడ్ కోటలో దాచాడని.. అక్బర్‌కి నిధి చోరీకి గురైందనే విషయమే తెలియకపోవడంతో జైఘడ్ కోటలో దాచిన ఖజానా ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది అనేది అక్కడ ప్రచారంలో ఉన్న కథనం. రాజస్థాన్ లో ప్రచారంలో ఉన్న ఈ కథనంలో కొన్ని స్పష్టతలు కొరవడినప్పటికీ.., అప్పుడో, ఇప్పుడో అక్కడి జనం నోట వినిపించే ఆసక్తికరమైన కథనాల్లో ఇదీ ఒకటని మాత్రం చెప్పొచ్చు.


ఇది కూడా చదవండి : Couples Mud Photoshoot: బట్టలు తీసేసి.. బురదలో పండిబొర్లాడుతూ ఫోటోషూట్


ఇది కూడా చదవండి : Saddest City in World: ప్రపంచంలోనే అత్యంత విషాదకరమైన నగరం.. జనాల ఆయుష్షు కూడా తక్కువే.. రక్తంలా ప్రవాహించే నది  


ఇది కూడా చదవండి : Samosa Business Income: నెలకు రూ.30 లక్షల జీతం వద్దనుకుని.. రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్న జంట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK