ఊరిస్తూ వచ్చిన విజయం ఆఖరికి ఆతిథ్య టీమ్‌కే దక్కింది. కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 72 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా భారతజట్టును ఓడించింది. 208 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక కోహ్లీ టీమ్ పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. సఫారీల బౌలర్ ఫిలాండర్ భారత్ బ్యాట్స్‌మన్లను ఎడాపెడా ఆడుకుంటూ.. 6 వికెట్లు తీశాడు.


ఆశ్విన్ (37 పరుగులు), కోహ్లీ (28 పరుగులు) మాత్రమే గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతమేరకు మెరుగ్గా రాణించి జట్టు ఆ మాత్రం స్కోరు చేయడానికైనా తోడ్పడ్డారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులతో సరిపెట్టుకుంది. రెండవ ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారింది. దక్షిణాఫ్రికా 130 పరుగులకే వికెట్లు అన్ని కోల్పోగా.. భారత్ మాత్రం ఏమీ తక్కువ తినలేదు అన్నట్లు 135 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థికి విజయాన్ని అందించింది. ఏదేమైనా.. ఇరు జట్లు రెండవ ఇన్నింగ్స్‌లో బౌలర్లనే హీరోలను చేశాయి.