India Beats Australia by 44 Runs: వరల్డ్ కప్‌ ఫైనల్లో ఓటమి బాధ నుంచి అభిమానులను గట్టేక్కించేందుకు టీమిండియా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. విశ్వకప్ ఆశలు అడియాశలు చేసిన ఆసీస్‌పై చెలరేగి ఆడుతోంది. వరుసగా రెండో టీ20లో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో కంగారూలను టీమిండియా చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (53), ఇషాన్ కిషన్ (52), రుతురాజ్ గైక్వాడ్ (58) అర్ధ సెంచరీలకు తోడు చివర్లో రింకూ సింగ్ (31) మెరుపులు తోడవ్వడంతో భారీ స్కోరు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది. టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చిన యశస్వి జైస్వాల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. 
  
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్‌ను శరవేగంగా ఆరంభించింది. తొలి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయడంతో బౌలింగ్ గాడితప్పినట్లు అనిపించింది. అయితే రవి బిష్టోయ్ జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. మాథ్యూ షార్ట్ (19), జోష్‌ ఇంగ్లిస్‌ (2)ను ఔట్ చేసి భారత్ శిబిరంలో ఉత్సాహం తీసుకువచ్చాడు. కాసేపటికే డేంజర్ మ్యాన్ మాక్స్‌వెల్‌ (12)ని అక్షర్‌ పటేల్ ఔట్ చేయడం.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌ (19) ఔట్ అవ్వడంతో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమయంలో స్టొయినిస్, టిమ్ డేవిడ్ ఎదురుదాడికి దిగారు. వరుసగా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరి ఓ దశలో దూకుడుతో ఆసీస్ గెలుస్తుందనిపించింది. లక్ష్యం వైపు దూసుకువస్తున్న ఆసీస్‌ను రవి బిష్టోయ్ మరోసారి దెబ్బ తీశాడు. టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 37, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఔట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఓవర్‌లోనే స్టొయినిస్ (25 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఔట్ అవ్వడంతో భారత్ విజయం ఖరారు అయింది. కెప్టెన్ మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 42, ఒక ఫోర్, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. సీన్ అబాట్ (1), నాథన్ ఎలిస్ (1), ఆడమ్ జంపా (1) వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. చివరకు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ , ప్రసిద్ధ్‌ కృష్ణ తలో మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్‌ చెరో వికెట్ పడగొట్టారు.


అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆకాశమే హద్దు చెలరేగింది. ఓ ఎండ్‌లో రుతురాజ్ యాంకర్ రోల్ ప్లే చేయగా.. యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో  53, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. ఆ తరువాత ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 52, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యకుమార్ యాదవ్ (10 బంతుల్లో 19, 2 సిక్సర్లు) దూకుడు ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. రింకూ సింగ్  (9 బంతుల్లో 31 నాటౌట్‌,  4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరి ఓవర్‌లో ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ 2 బంతుల్లో 1 సిక్స్ సాయంతో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.  


Also Read: IPL 2024 CSK List: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఐపీఎల్ ఆడనున్న ధోనీ, ఆరుగురు రిలీజ్


Also Read: RCB Retain List: వ్యాలెట్ పెరగాలంటే వేటు తప్పదు, 11 మందిని వదిలించుకున్న ఆర్సీబీ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook