టీ-20 లీగ్ 11వ సీజన్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది. చెన్నైతో తొలి క్వాలిఫయర్లో చేతిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకున్న హైదరాబాద్‌..ఈసారి చేజారిపోతున్న మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది. రషీద్ ఖాన్ మూడు వికెట్లతో కీలక పాత్ర పోషించగా.. సిద్దార్థ్ కౌల్, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌(KKR-కోల్‌కతా నైట్‌రైడర్స్ )ను 161/9 పరుగులకే ఎస్ఆర్‌హెచ్(SRH-స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్) బౌలర్లు రషీద్‌ (3/19), సిద్దార్థ్‌ కౌల్‌ (2/32), బ్రాత్‌వైట్‌ (2/15) కట్టడి చేశారు. ఓపెనర్లు క్రిస్‌ లిన్‌ (48; 31 బంతుల్లో 6×4, 2×6), సునీల్‌ నరైన్‌ (26; 13 బంతుల్లో 4×4, 1×6)మినహా ఎవ్వరూ ఆడలేదు. హైదరాబాద్ విజయంలో రషీద్ ఖాన్ (34 నాటౌట్‌; 10 బంతుల్లో 2×4, 4×6, 3 వికెట్లు, 2 క్యాచ్‌లు) కీలకపాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌కు ఆశలే లేని స్థితిలో కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. కాగా అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



ఈ నెల 27న ఆదివారం ముంబాయిలో జరిగే ఫైనల్లో సీఎస్‌కే(CSK-చెన్నై సూపర్ కింగ్స్ )తో ఎస్ఆర్‌హెచ్(SRH-స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్) అమీతుమీ తేల్చుకోనుంది.