ముంబై: విండీస్ పర్యటనపై టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. వరల్డ్ కప్ టోర్నమెంట్ తర్వాత ధోని క్రికెట్‌కి వీడ్కోలు పలకనున్నాడన్న ఊహాగానాల మధ్య ఆయన తన రిటైర్ మెంట్, విండీస్ పర్యటనపై కీలక ప్రకటన చేశాడు. విండీస్ పర్యటనకు తాను అందుబాటులో ఉండడం లేదన్న ధోనీ.. అలాగే ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ గురించి కూడా ఏమీ ఆలోచించడం లేదని అన్నాడు. విండీస్ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసే లక్ష్యంతో బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ముంబైలో సమావేశం కానున్న నేపథ్యంలో ధోనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


ఇదే విషయమై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదని తేల్చిచెప్పారు. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకుగాను ధోనీ రెండు నెలలపాటు సెలవు తీసుకుంటున్నాడని సదరు అధికారి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కే ప్రసాద్‌కు తెలియజేసినట్టు ఆ అధికారి వెల్లడించారు.